
YSR Praja News : హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు మంగళవారం సమావేశమయ్యారు. నందినగర్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ భేటీలో ఉప ఎన్నికల ప్రచార వ్యూహంపై ప్రాథమిక చర్చలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై బుధవారం హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ప్రచార వ్యూహానికి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికలు జరిగే పక్షంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలకు బూత్వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
కోర్టు ప్రతికూలంగా స్పందించినట్లయితే, ఇతర జిల్లాల నేతలకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగానే ఇతర జిల్లాల నాయకులను కూడా ప్రచారంలో మోహరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
నేడు మరో కీలక భేటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వ్యూహానికి తుది రూపు ఇవ్వడానికి బుధవారం మరో భేటీ జరగనుంది. కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారు.
పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన నేపథ్యంలో రోడ్షోలు, హాల్ మీటింగ్స్ షెడ్యూల్పై చర్చించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనే ప్రచార కార్యక్రమాలకు తుది షెడ్యూల్ ఖరారవుతుందని సమాచారం.
ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేటీఆర్ విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. “ఇన్నోవేటివ్ థింకింగ్” పేరిట భార్యలకు ఉచిత ప్రయాణం ఇస్తూ భర్తల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేయడం, పిల్లల బస్ పాస్ రేట్లు పెంచడం వంటి చర్యలతో ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని ఆయన మండిపడ్డారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి జరిగే నష్టాన్ని చార్జీల పెంపుతో భర్తీ చేసుకుంటోందని, ఒక్కో కుటుంబంపై సుమారు 20% అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదని, అందుకే ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ చార్జీల పెంపుకు కాంగ్రెస్ ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
