తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే గత రెండు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా, ఇక ముందు మరింత పడిపోతాయని అంచనా వేస్తున్నారు.
సగటున సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గురువారం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే, మహబూబ్నగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 33.1 డిగ్రీల సెల్సియస్గా ఉండగా, ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 7.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల వరకు తక్కువగా ఉండగా, శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ తగ్గుదల 4 డిగ్రీల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో చల్లని గాలులు వీస్తుండటంతో చలి ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. మండలాల వారీగా రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అత్యల్ప ఉష్ణోగ్రత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 5.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.4 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 6.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీమాపూర్లో 7.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
YSR Praja News : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మైనారిటీల పట్ల నిర్లక్ష్య వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఇమామ్లు, మౌజాన్లకు ప్రతి నెల చెల్లించాల్సిన…
YSR Praja News Telugu : హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక…