
YSR Praja News : విజయవాడ: దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన హెలి జాయ్ రైడ్ కార్యక్రమానికి నగర ప్రజలు, భక్తులు, పర్యాటకులు భారీగా స్పందిస్తున్నారు. విజయవాడ ఉత్సవ్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఆకర్షణను ప్రతి వయసువారు ఆస్వాదిస్తూ, ఆకాశం నుండి కనకదుర్గమ్మ ఆలయం, కృష్ణానది పరిసరాలు, నగర సౌందర్యాన్ని వీక్షిస్తూ ఆనందం పొందుతున్నారు.
విహంగ్ అడ్వెంచర్స్ ఏవియేషన్ నిర్వాహకుడు సూర్య మాట్లాడుతూ, “ప్రజలకు ఒక కొత్త అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో హెలి రైడ్స్ ప్రారంభించాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో హెలి టూరిజాన్ని ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఉన్నారు. ప్రజల విశేష స్పందన దృష్ట్యా ఈ సేవలను మరో మూడు రోజులు కొనసాగిస్తున్నాం” అని ప్రకటించారు.
కలెక్టర్ నుండి అవసరమైన అనుమతులు కూడా పొందినట్లు ఆయన తెలిపారు. ఈ రైడ్స్ ఆదివారం సాయంత్రం వరకు అందుబాటులో ఉండనున్నాయి.
కుటుంబ సభ్యులు, పిల్లలు, యువత పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉత్సాహంగా హెలి రైడ్స్ను ఆస్వాదిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భక్తి, వినోదం మాత్రమే కాకుండా పర్యాటకానికి కొత్త వన్నెలు అద్దడానికి ప్రభుత్వం, నిర్వాహకులు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
