పదేళ్ల తర్వాత టాలీవుడ్‌కు ప్రభుత్వ పురస్కారాలు.. తొలి ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ విజేతలు వీరే!

YSR Praja News Telugu : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ సినీ పురస్కారాల పండుగ మళ్లీ మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చే ‘నంది అవార్డుల’ స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (TGFA) ప్రదానోత్సవం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 19, 2026న హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత అట్టహాసంగా జరిగింది.

ప్రజా గాయకుడు, యుద్ధనౌక దివంగత ‘గద్దర్’ పేరిట నెలకొల్పిన ఈ అవార్డుల తొలి వేడుకకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు.

కన్నుల పండువగా వేడుక.. తారల సందడి

ఈ మెగా ఈవెంట్‌కు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, రామ్ చరణ్, జయసుధ, ఖుష్బూతో పాటు బాలీవుడ్ నుంచి మాధురీ దీక్షిత్, రితేష్ దేశ్‌ముఖ్ – జెనీలియా దంపతులు తదితరులు పాల్గొని వేడుకకు గ్లామర్ అద్దారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టాలీవుడ్‌కు పలు వరాలు ప్రకటించారు:

సింగిల్ విండో విధానం: హైదరాబాద్‌ను గ్లోబల్ సినీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.

హాలీవుడ్‌కు దీటుగా: ఐటీ, ఫార్మా రంగాల తరహాలోనే సినిమాను ఒక పరిశ్రమగా గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించిందని, ఇది హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లేనని ఆయన అభివర్ణించారు.

గద్దర్ స్ఫూర్తి: లక్షలాది మందిని తన గళంతో చైతన్య పరిచిన గద్దర్ పేరుతో ఈ అవార్డులను పునరుద్ధరించడం గర్వకారణమన్నారు.

చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కళాకారులను ఉత్సాహపరచడంలో పొరుగు రాష్ట్రం (ఏపీ) కొంత వెనుకబడి ఉందని, సినిమా వాళ్లకు అత్యంత సన్నిహితుడైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ కూడా అవార్డులు పునరుద్ధరించాలని కోరారు.

గద్దర్ అవార్డ్స్ 2025 – ప్రధాన విజేతల జాబితా

ఈ వేడుకలో 2025 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ప్రధానం చేశారు.

ప్రత్యేక పురస్కారాలు (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ తరహా):

ఎన్టీఆర్ జాతీయ అవార్డు: మెగాస్టార్ చిరంజీవి

పైడి జయరాజ్ అవార్డు: విశ్వనటుడు కమల్ హాసన్

అక్కినేని నాగేశ్వరరావు అవార్డు: జయసుధ (సీనియర్ నటి)

బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సింగీతం శ్రీనివాసరావు (ఆయన తరపున కమల్ హాసన్ స్వీకరించారు)

నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు: సి. అశ్వనీదత్ (ప్రముఖ నిర్మాత)

రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: ఎ. రమేష్ ప్రసాద్

కె.ఎల్. కాంతారావు ఫిల్మ్ అవార్డు: ఆర్. నారాయణమూర్తి

డాక్టర్ సి. నారాయణరెడ్డి అవార్డు: సుద్దాల అశోక్ తేజ (గేయ రచయిత)

సినిమా & నటీనటుల విభాగాలు:

ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి

ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)

ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)

ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ సహాయ నటుడు: శివాజీ (దండోరా)

ఉత్తమ సహాయ నటి: భూమిక (యుఫోరియా)

ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం

ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం: తండేల్

రాజకీయ వివాదం

ఒకవైపు అవార్డుల పండుగ ఘనంగా జరగ్గా, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) నేతలు ఈ అవార్డుల ఎంపికపై పెదవి విరిచారు. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో అద్భుతమైన పాట రాసిన తెలంగాణ ఉద్యమకారుడు మిట్టపల్లి సురేందర్‌కు కాకుండా ఏపీకి చెందిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇవి గద్దర్ అవార్డులు కావని, కాంగ్రెస్ నాయకుల “ఖద్దర్ అవార్డులు” అని ఆయన విమర్శించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *