
YSR Praja News Telugu : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ప్రాథమిక విషయాలపై కూడా అవగాహన కరువైందని, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ పరువు తీసేలా ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల సిద్దిపేట జిల్లా పర్యటనలో పటాన్చెరులోని ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థ ‘ఇక్రిశాట్’ (ICRISAT) పై సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఆదివారం హరీశ్ రావు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
ఇక్రిశాట్ అమెరికా సంస్థ ఎలా అవుతుంది?
1972 నుంచి హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు కేంద్రంగా ప్రపంచ స్థాయి వ్యవసాయ పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్ను.. సీఎం రేవంత్ రెడ్డి ‘అమెరికా సంస్థ’ లేదా ‘అమెరికా రీసెర్చ్ సెంటర్’ అని పిలవడం ఆయన అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని హరీశ్ రావు మండిపడ్డారు. దశాబ్దాలుగా కళ్ల ముందున్న గొప్ప సంస్థల గురించి కనీస వాస్తవాలు తెలుసుకోకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత బాధాకరమన్నారు.
ఇక్రిశాట్ చరిత్ర ఇదీ.. సీఎం తెలుసుకోవాలి!
ఇక్రిశాట్ అనేది ఏ ఒక్క దేశానికో, లేక అమెరికాకో చెందిన సంస్థ కాదని హరీశ్ రావు స్పష్టం చేశారు. అది సీజీఐఏఆర్ (CGIAR) వ్యవస్థలో భాగమైన ఒక స్వతంత్ర, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అని గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP), ప్రపంచ బ్యాంక్ (World Bank), ఆహార వ్యవసాయ సంస్థ (FAO)ల మద్దతుతో ఈ సంస్థ ఏర్పాటైందని ఆయన వివరించారు. ప్రారంభ దశలో ఫోర్డ్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లతో పాటు భారత ప్రభుత్వం, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సహకారంతో నడుస్తున్న ఒక గ్లోబల్ వేదికను పట్టుకుని ‘అమెరికా సంస్థ’ అనడం దారుణమన్నారు.
నీటి ప్రాజెక్టులపైనా అదే అజ్ఞానం..
రేవంత్ రెడ్డికి కేవలం ఇక్రిశాట్ మీదే కాదు, రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, జల వనరుల పట్ల కూడా అవగాహన లేదని హరీశ్ విమర్శించారు. నల్లమల అటవీ ప్రాంత సరిహద్దులు, కృష్ణా-గోదావరి నదీ జలాలు, సుంకేశుల ప్రాజెక్టు తదితర కీలక అంశాలపై కూడా సీఎంకు కనీస నాలెడ్జ్ లేదని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రాథమిక విషయాలు తెలియని స్థితిలో రాష్ట్రాన్ని నడిపిస్తుండటం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చేసే ప్రతి ప్రకటన బాధ్యతాయుతంగా ఉండాలని, వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడాలని హరీశ్ రావు హితవు పలికారు. ఇకనైనా నోటికి వచ్చినట్లు మాట్లాడటం మానుకుని, వాస్తవాలు తెలుసుకుని ప్రవర్తించాలని సూచించారు.




