
YSR Praja News Telugu : అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన ‘మావిగన్’ అంశానికి ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనను చూసి ఓర్వలేకే అధికార టీడీపీ ‘డైవర్షన్ పాలిటిక్స్’కు తెరలేపిందని వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. మావిగన్ పై జరుగుతున్న సానుకూల చర్చ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పక్షం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని విమర్శించింది.
రోజుకో డైవర్షన్ స్కీమ్..
వైఎస్ జగన్ ‘మావిగన్’ ప్రస్తావన తెచ్చిన రోజు నుంచే టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని వైసీపీ ఆరోపించింది. టీడీపీ నేత పట్టాభి జగన్ ను ‘సైకో’ అంటూ విమర్శించగా, మంత్రి అనిత ‘సంగనాచి’ అంటూ దుర్భాషలాడారని గుర్తుచేసింది. దానికి తోడు ఒక పచ్చ పత్రిక అధినేత ఆర్కే సైతం వైసీపీ నేతల భార్యల గురించి అభ్యంతరకర రాతలు రాశారని, ఇవన్నీ కేవలం ప్రజల దృష్టిని మళ్లించే రోజువారీ డైవర్షన్ స్కీమ్లో భాగమేనని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
భావోద్వేగానికి గురైన బొత్స సత్యనారాయణ
తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై చేసిన వ్యాఖ్యలు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బొత్స సత్యనారాయణ.. మహానేత వైఎస్సార్ మరణాన్ని గుర్తుకు తెచ్చుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మహానేత కుమారుడిపై ఇలాంటి అభాండాలు వేయడాన్ని తట్టుకోలేక ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
దేశం గర్వించే నాయకుడు వైఎస్సార్..
అచ్చెన్నాయుడి దిగజారుడు రాజకీయాలపై బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తుల్లో వైఎస్సార్ ఒకరని కొనియాడారు. అలాంటి మహానేత ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగించిన చారిత్రక దినాన.. అచ్చెన్నాయుడు నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని బొత్స మండిపడ్డారు. టీడీపీ నేతల ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలను, డైవర్షన్ రాజకీయాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బొత్స స్పష్టం చేశారు.




