YSR Praja News Telugu : హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్ర సందర్భంగా చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో మృతిచెందిన 45 మంది తెలంగాణ యాత్రికుల కుటుంబాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి (TSMHPS) రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్ తీవ్రంగా మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ఘనంగా హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను ఆచరణలోకి తేవడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
2025 నవంబర్ 17న మదీనా సమీపంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్ నిర్ణయం ప్రకారం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తామని ప్రకటించింది. అయితే ప్రమాదం జరిగి నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్క కుటుంబానికి కూడా ఆర్థిక సాయం అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అబ్దుల్ వాహాబ్ వ్యాఖ్యానించారు.
ప్రకటనలు, హామీలతో సరిపెట్టుకుని వాస్తవంలో బాధితులను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. జీవోల పేరుతో కాలయాపన చేస్తూ మైనార్టీల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య ధోరణి బయటపడుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మైనార్టీల వద్దకు వచ్చే నాయకులకు, ఈ రోజు బాధిత కుటుంబాల కన్నీళ్లు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
ఆర్థికంగా దుర్బల స్థితిలో ఉన్న అనేక కుటుంబాలు ఈ పరిహారం కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి, 45 మంది మృతుల కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్గ్రేషియా మొత్తాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే, తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని అబ్దుల్ వాహాబ్ హెచ్చరించారు.
ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితం కాకుండా, బాధితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, మానవీయ కోణంతో వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
YSR Praja News Telugu : రాజన్న సిరిసిల్ల (గొల్లపల్లి): సమాజ శ్రేయస్సు కోసం, గ్రామాల పరిశుభ్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలు…