YSR Praja News హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సిటీ బస్సు చార్జీ పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, “ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి ₹10 పెంచడం పేద, మధ్యతరగతి ప్రయాణికులపై దారుణ భారం. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం దుర్మార్గమైనది” అని మండిపడ్డారు.
“ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతుండగా, ఇప్పుడు ప్రతి ప్రయాణికుడిపై నెలకు సుమారు ₹500 అదనపు భారం మోపడం అంటే బడుగు ప్రజల జీవితాలతో ఆటలాడటమే. విద్యార్థుల బస్ చార్జీలు, టీ–24 టిక్కెట్లను పెంచడమే చాలదన్నట్టు ఇప్పుడు కనీస చార్జీపై కూడా 50 శాతం పెంపు చేయడం రేవంత్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం” అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇంకా ఆయన, “రాజధాని ప్రజలపై కక్షతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకం పేరుతో ఆర్టీసీని దివాళా తీయించి, ఇప్పుడు సామాన్యుల జేబులు ఖాళీ చేయడం క్షమించరాని పని” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు..