
YSR Praja News Telugu : తాండూరు, మార్చి 8 (వార్తా ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం (CPM), సీఐటీయూ (CITU), ఇతర ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గ్యాస్ ధరల పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై సుమారు రూ. 60 వేల కోట్ల మేర భారీ భారాన్ని మోపిందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాండూరు పట్టణంలో సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెంచిన ధరలకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
యుద్ధం సాకుతో ధరల పెంపు దారుణం..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం పేరుతో.. రాబోయే రోజుల్లో చమురు నిల్వల కొరత రానుందనే సాకు చూపి గ్యాస్ ధరలను పెంచడం దారుణం. గ్యాస్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి తద్వారా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయి” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘విశ్వగురువు’ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు?
తనకు తాను ‘విశ్వగురువు’గా కీర్తించుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ అంతర్జాతీయ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారని శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. “అమెరికా ఏది చెబితే అది వినేలా మన ప్రధాని వ్యవహరిస్తున్నారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుంటే, మోడీ ఆయనకు మోకరిల్లుతూ మన దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారు” అని దుయ్యబట్టారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు..
ఇరాన్పై యుద్ధం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అమాంతం పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోందని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ వాస్తవాలను దేశ ప్రజలు గ్రహించి, తమను మోసం చేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన కోరారు. బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) పిలుపునిచ్చిందని ఆయన గుర్తు చేశారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కే. చంద్రయ్య, జి. రత్నం, సీపీఎం నాయకులు శ్రీనివాస్, దస్తప్ప, ఎమ్మార్పీఎస్ (MRPS) పట్టణ కార్యదర్శి రవికుమార్, రాములు, రఘుపతి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు




