
YSR Praja News : న్యాయవ్యవస్థను కుదిపేసిన సుప్రీంకోర్టు షూ ఘటనపై కొత్త మలుపు తిరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై షూ విసిరిన లాయర్ రాకేష్ కిషోర్(71)ను సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ బహిష్కరించింది. భవిష్యత్తులో కోర్టు ప్రాంగణంలోకి ఆయన ప్రవేశించకుండా ఎంట్రీ కార్డు రద్దు చేసినట్లు గురువారం ప్రకటించింది.
అక్టోబర్ 6న సుప్రీంకోర్టు నెంబర్ 1 హాల్లో కేసుల మెన్షనింగ్ జరుగుతున్న సమయంలో రాకేష్ కిషోర్ షూ విసరడంతో కలకలం చెలరేగింది. షూ బెంచ్ దాకా చేరకుండానే కింద పడిపోవడంతో లాయర్లు అతన్ని అడ్డుకున్నారు. దాడికి జస్టిస్ గవాయ్ కూల్గా స్పందిస్తూ — “ఇలాంటి చర్యలు నన్ను ప్రభావితం చేయలేవు” అంటూ కోర్టు కార్యకలాపాలను కొనసాగించారు.
దాడి సమయంలో “సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించం” అని రాకేష్ కిషోర్ నినాదాలు చేసినట్లు సమాచారం. అయితే సీజేఐ సూచనతో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ అతనిపై పోలీసు ఫిర్యాదు చేయలేదు. ఢిల్లీ పోలీసులు విచారణ అనంతరం అతన్ని షూ, పత్రాలతో సహా విడుదల చేశారు.
తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతన్ని దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ ప్రాక్టీస్ చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈలోపే, సుప్రీంకోర్టు బార్ అసోషియేషన్ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
దాడి చర్యను సమర్థిస్తూ రాకేష్ కిషోర్ “ఇది దైవ నిర్ణయం” అని మీడియాకు వెల్లడించారు. తనపై వివరణ లేకుండా సస్పెండ్ చేయడాన్ని తప్పుబడుతూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఇక తాజాగా బెంగళూరులో అతనిపై కొత్త కేసు నమోదైంది. సీజేఐపై ఉద్దేశపూర్వక దాడి చేశారంటూ ఆల్ ఇండియా అడ్వొకేట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు భక్తవత్సల విధానసౌధ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేసిన కేసు ఢిల్లీకి బదిలీ
కానుంది.




