హరీష్ రావు బహిరంగ లేఖ: అసెంబ్లీ ప్రతిష్ట దెబ్బతింటోందని స్పీకర్‌ పై విమర్శలు

YSR Praja News : హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఓ బహిరంగ లేఖ రాస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభ నిబంధనలను పక్కన పెట్టి పనిచేస్తూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెండేళ్లుగా హౌస్ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగానే ఉంచడం, రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా పాలన సాగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని హరీష్ తిప్పికొట్టారు.
ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పులను కూడా నిర్లక్ష్యం చేస్తూ నిర్ణయాలు తీసుకోకపోవడం ప్రజా ఆశయాలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. శాసనసభలో నిబద్ధత, హుందాతనానికి లోటు కనిపించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
హరీష్ రావు ప్రధాన డిమాండ్లు
1. ఒక్కొ ఏడాదిలో కనీసం 30 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి
2. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను పటిష్ఠంగా అమలు చేయాలి
3. అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలి
4. అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి
5. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలి
6. ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలి
7. సభ నిబంధనలు, శాసన పరిపాటిని ఖచ్చితంగా పాటించాలి
8. అనర్హత పిటిషన్లపై రాజ్యాంగ, చట్టాలకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలి
శాసనసభ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు ప్రస్తుత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *