
YSR Praja News Telugu : తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం, అక్రమ అరెస్టులకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వికారాబాద్ జిల్లా తాండూర్ పరిధిలోని ఆశా వర్కర్లను, సీఐటీయూ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.

ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ కోటి కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించగా, ప్రభుత్వం పోలీసుల ద్వారా తీవ్ర నిర్బంధాలు విధించిందని ఆయన ఆరోపించారు.
ఇంటింటికి వెళ్లి అరెస్టులు.. భయభ్రాంతులకు గురిచేసిన పోలీసులు
‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో తరలివస్తారన్న సమాచారం నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల పేరుతో ఇంటింటికి వెళ్లి ఆశా వర్కర్లను అరెస్టులు చేయించడం, ప్రయాణాలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడిందని సీఐటీయూ నేతలు తెలిపారు.
హైదరాబాద్ కోటికి చేరుకున్న ఆశా వర్కర్లను కూడా పోలీసులు వెతికి వెతికి అరెస్టులు చేయడం, వారి సెల్ ఫోన్లు పరిశీలించడం, వాట్సాప్ గ్రూపుల సందేశాలను చూపించాలని ఒత్తిడి చేయడం ద్వారా మానసికంగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు.
ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్లు ఇవే
సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆశా వర్కర్ల సమస్యలు ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా:
జనవరి నెల పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలి
ఆశా వర్కర్లకు రూ. 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి
ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలి
ప్రమాద బీమా రూ. 50 లక్షలు ఇవ్వాలి
మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలకు రూ. 50,000 అంత్యక్రియ ఖర్చులు ఇవ్వాలి
లెప్రసీ సర్వే, పల్స్ పోలియో, ఎన్నికల డ్యూటీకి సంబంధించిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల సంక్షేమానికి సరిపడా నిధులు కేటాయించాలి
అని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకుండా, శాంతియుత నిరసనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని సీఐటీయూ నేతలు పేర్కొన్నారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు, ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని తక్షణమే పరిష్కారం చూపాలని ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని వారు కోరారు.




