
YSR Praja News : భవానిపురం బాధితులకు వైఎస్ జగన్ అండ
విజయవాడ – డిసెంబర్ 05: భవానిపురం 42 ప్లాట్ల కూల్చివేత ఘటనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ప్రభుత్వం అక్రమంగా ఇళ్లను కూల్చివేయడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్ను కలిసి తమపై జరిగిన అన్యాయాన్ని బాధితులు విన్నవించారు. ప్రభుత్వం తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేసిన వారు.. తాము రోడ్డు మీదకు వచ్చోపడ్డామని వర్ణించారు. సమస్యపై పూర్తి వివరాలు తెలుసుకున్న వైఎస్ జగన్ బాధితులకు ధైర్యం చెప్పి, పార్టీ నాయకులను వెంటనే భవానిపురానికి వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించారు.
జగన్ సూచన మేరకు వైయస్ఆర్సీపీ నేతల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజి రెడ్డి తదితరులు అక్కడి ప్రజలను పరామర్శించారు.
తమ హక్కుల కోసం న్యాయపోరాటం కొనసాగుతుందని, పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని వైయస్ఆర్సీపీ నేతలు బాధితులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కూల్చివేతలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.




