యూట్యూబర్ అన్వేష్ చుట్టూ వివాదం ముదురుతోంది… మహిళా కమిషన్ రంగంలోకి

YSR Praja News Telugu : హైదరాబాద్‌: “నమస్తే ఫ్రెండ్స్… నా పేరు అన్వేష్. నేను ప్రపంచ యాత్రికుడిని” అంటూ ప్రపంచ దేశాల్లోని వింతలు, విశేషాలను చూపిస్తూ గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అన్వేష్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో విమర్శలు ఎదుర్కొన్న అతడు, క్షమాపణలు చెప్పినప్పటికీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు సమాచారం.

ఈ క్రమంలో ‘గరికపాటిపై యుద్ధం’ పేరుతో వచ్చిన మరో వివాదం తీవ్ర దుమారం రేపింది. అన్వేష్ కంటెంట్ మహిళలను అవమానించేలా, అసభ్యంగా ఉందంటూ తెలంగాణ మహిళా కమిషన్కు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. మహిళలను వస్తువుల్లా చూపిస్తూ వీడియోలు రూపొందించాడని, ఇది వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదుదారులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.

అంతేకాకుండా, ఆ ఛానల్‌లో బాలల హక్కులకు భంగం కలిగించే కంటెంట్ కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయి. సమాజంలో నైతిక విలువలు, సామాజిక సమతుల్యతకు విఘాతం కలిగించే అంశాలు ఈ వీడియోల్లో ఉన్నాయని ప్రాథమికంగా కమిషన్ అభిప్రాయపడినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సంబంధిత వీడియోల లింకులు, ఖాతా వివరాలను కమిషన్ సేకరించినట్లు తెలిసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కూడా కమిషన్ దృష్టి సారించింది. ఇవన్నీ ప్రజా నైతికతకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు అవసరమని స్పష్టం చేసింది.

విచారణలో అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన కమిషన్, ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW)కు పంపినట్లు వెల్లడించింది. మహిళల గౌరవాన్ని కాపాడటం, బాలల హక్కులను రక్షించడం అత్యంత కీలకమని పేర్కొన్న తెలంగాణ మహిళా కమిషన్, ఈ అంశంపై ఎన్సీడబ్ల్యూ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఈ పరిణామాలతో యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై కంటెంట్ సృష్టించే వారి బాధ్యతపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజా ప్రయోజనం, నైతిక విలువలు, చట్టాల పరిమితుల్లోనే కంటెంట్ ఉండాలనే డిమాండ్ బలపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *