YSR Praja News : తాడేపల్లి: జోజినగర్ బాధితులకు అండగా వైఎస్ జగన్ – రేపు విజయవాడ పర్యటన
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (మంగళవారం, డిసెంబర్ 16) విజయవాడలో పర్యటించనున్నారు. భవానీపురం పరిధిలోని జోజినగర్లో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన ప్రత్యక్షంగా పరామర్శించనున్నారు.
జోజినగర్ ప్రాంతానికి చెందిన 42 ప్లాట్ల బాధితులు ఇటీవల తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి తమ వేదనను వ్యక్తం చేశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారని, ఎన్నో ఏళ్ల కష్టాన్ని క్షణాల్లో నాశనం చేశారని వారు ఆవేదనతో వివరించారు. బాధితుల మాటలు విన్న వైఎస్ జగన్, వారికి పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని, అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.
బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం, పక్కా రిజిస్ట్రేషన్ పత్రాలతో ప్లాట్లు కొనుగోలు చేసి, బ్యాంకు రుణాలు తీసుకుని సుమారు 25 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంటి పన్నులు, కరెంట్ బిల్లులు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని వారు తెలిపారు. అయినప్పటికీ, డిసెంబర్ 31 వరకు ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా, వాటిని పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ తెల్లవారుజామున భారీ పోలీసు బలగాలతో అధికారులు వచ్చి ఇళ్లను నేలమట్టం చేశారని వాపోయారు.
ఈ విషయమై అధికార టీడీపీ, జనసేన నేతలను ఆశ్రయించినా తమ సమస్యకు స్పందన లేదని, ఇళ్లు కూల్చివేత అనంతరం ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ పరామర్శకు కూడా రాలేదని బాధితులు కన్నీటితో తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు వైఎస్ జగన్ను వేడుకున్నారు.
దీనిపై స్పందించిన వైఎస్ జగన్, బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ నిలుస్తుందని స్పష్టం చేశారు. చట్టపరంగా పోరాటం చేసి న్యాయం సాధించే వరకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఈ హామీ మేరకు రేపు విజయవాడకు వచ్చి, కూల్చివేతకు గురైన జోజినగర్ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు.